నల్లబెల్లి రైతు వేదికలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
ప్రత్యేక వైద్య నిపుణులతో మెడికల్ క్యాంపు ప్రారంభం
కాకతీయ. నల్లబెల్లి: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జీవన శైలిలో మార్పులు అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శనివారం నల్లబెల్లి రైతు వేదికలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహించే మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో మార్పులు చేసుకుని అందుబాటులో ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పూర్వకాలంలో పెద్దలు కష్టపడి పనిచేస్తూ సీజనల్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవారని, వారి జీవన విధానాన్ని అనుసరించి క్రమబద్ధమైన జీవితం గడపాలని తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి నివేదికలో భాగంగా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మాతా, శిశు, కిశోర, వృద్ధుల ఆరోగ్య సేవలను నాలుగు దశలుగా అందిస్తూ మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ పరీక్షలు, టిబి పరీక్షలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ పరీక్షలను తెలంగాణ టీ-హబ్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరీక్షలు, చికిత్సలు అందిస్తామని పేర్కొన్నారు.
అలాగే మార్చి 8 నుంచి 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సంపేట, సీకేఎం ఆస్పత్రి వరంగల్, ఎంజీఎం వరంగల్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా విస్తరించనున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీవో ఉమా, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, జీజీహెచ్ నర్సంపేట డాక్టర్ కిషన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇఫ్తీకర్ అహ్మద్, డాక్టర్ విజయకుమార్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


