ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక శుభ సూచకం
ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
లింగాల ఘనపురంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభం
శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ,జనగామ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం లింగాల ఘనపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉండి ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుందని అన్నారు. జనగామ జిల్లాను ధాన్యం ఉత్పత్తి, నీటిపారుదల, విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరేలా అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక వైద్య శిబిరంలో కంటి, దంత, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలకు చెందిన వైద్యులు సేవలు అందించారు. ప్రజలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఆరోగ్య సేవల విస్తరణ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ముందస్తు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది గ్రామస్థాయి నుంచి ప్రజల సహకారంతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, దంత చికిత్స గది, జనరల్ వార్డు తదితర విభాగాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరామ్, వైద్య అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


