ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు
* రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య
కాకతీయ,చేర్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సభలో సర్పంచ్ కొమురయ్య మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు సభలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కింద గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం వంటి పథకాలతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, ఇందిరా మహిళ శక్తి పథకం, రైతులకు బోనస్, విద్యార్థులకు అల్పాహారం, దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలను చదివి వినిపిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో, సిడిపిఓ రమాదేవి, ఆయా శాఖలకు చెందిన అధికారులతో పాటు ఉప సర్పంచ్ నిమ్మ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


