పకడ్బందీగా ప్రగతి సాగాలి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్లక్ష్యం వహించొద్దు
99రోజుల్లో అందరి పనితీరులో మార్పు కనిపించాలి
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మార్చి చివరినాటికి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
వ్యవసాయంలో ఆధునిక సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం
పిల్లల మధ్యాహ్న భోజనంలో చికెన్ స్థానంలో చేపలకు ప్రతిపాదన
అధికారులు–ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచన
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపట్టిన తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణను గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షత వహించగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆది నారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్గం వెంకట్రావు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణలో చేపట్టే కార్యక్రమాలను అధికారులు వివరించారు. గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల వరకు కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని మంత్రులు సూచించారు.

పేదల సంక్షేమమే లక్ష్యం : జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ పేదల కోసం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రైతులు పండించే పంటలకు బోనస్ ఇవ్వడం ద్వారా వారిలో నమ్మకం పెంచుతున్నామని తెలిపారు. రేషన్ ద్వారా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. గతంలో మధ్యవర్తులు లబ్ధిదారుల పేర్లతో ఇళ్లను మంజూరు చేయించుకుని డబ్బులు వసూలు చేసిన ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి అందించే చికెన్ స్థానంలో చేపలు అందించే అంశంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమన్నారు. తొంభై తొమ్మిది రోజుల కార్యాచరణను ప్రతి గ్రామం, పట్టణానికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పది ప్రధాన రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. గ్రౌండింగ్ కాని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆసక్తి చూపకపోతే అదే గ్రామంలో ఇతర అర్హులకు కేటాయించాలని సూచించారు. మార్చి చివరి నాటికి మొదటి విడతలో మంజూరైన ప్రతి ఇల్లు గ్రౌండింగ్ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ డ్రైనేజీ సమస్యలు ఉన్నాయో పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలను సంయుక్త సర్వే ద్వారా పరిష్కరించాలని కూడా ఆదేశించారు.

99 రోజుల ప్రత్యేక కార్యాచరణ : కలెక్టర్ దురిశెట్టి
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మార్చి ఆరు నుంచి జూన్ పన్నెండు వరకు తొంభై తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. పారిశుధ్యం, వైద్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, చైల్డ్ సేఫ్టీ, వ్యవసాయం, విద్య, యువజన క్రీడలు, మహిళా సంక్షేమం, పర్యావరణం వంటి పది ప్రధాన అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో పది వేల ఇందిరమ్మ ఇండ్లను ఈ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసి గృహప్రవేశం చేసే లక్ష్యంతో చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వీధి కుక్కల సమస్యపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రైతులకు పంట మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులు, ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని కలెక్టర్ తెలిపారు.



