ఉగాదిలోపే పదవులు!
తెలంగాణలో త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ
సీఎం, పీసీసీ ఛీఫ్కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ !
ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు భేటీ
సమావేశంలో నామినేటెడ్ పదవులపై కీలక నిర్ణయం !
ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలకు మీనాక్షి నటరాజన్ నివేదిక
పదవులు పంపకాల్లో జాప్యంతో నేతల్లో నైరాశ్యం..
ఆశావహుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
కొర్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, డివిజన్ స్థాయి పోస్టుల కోసం నిరీక్షణ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.
అన్నీ కుదిరితే ఉగాదిలోపే పదవుల పందేరం చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లతోపాటు జిల్లా, డివిజన్ స్థాయిల్లోనూ పదవులు భర్తీచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదవుల పంపకాల్లో జాప్యంతో నేతల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీ అప్పగించిన బాధ్యతలను నేతలు శాయశక్తులా నెరవేర్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్న నేపథ్యంలో ఇక ఆలస్యం చేయకుండా నామినేడెట్ పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. ఏఐసీసీ పెద్దలకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ ఛీఫ్ మహేష్కుమార్ గౌడ్తోపాటు రాష్ట్ర మంత్రులు భేటీ అవడం ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా చర్చకు రాగా.. ఖర్గే, రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
జిల్లాలవారీగా నేతల జాబితా సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి 2024 జూన్లో ఒకేసారి 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఆ తర్వాత కూడా పలు పదవులను భర్తీ చేస్తూ వెళుతోంది. అయితే మరో 35 నుంచి 40 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని గడిచిన కొన్ని నెలలుగా డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రక్రియలో రకరకాల కారణాల వల్ల జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. డీసీసీ పదవుల నియామకం.. ఇతర కార్యక్రమాల నిమిత్తం జిల్లాల్లో మీనాక్షి నటరాజన్ పర్యటించిన సందర్భాల్లోనూ పదవుల అంశంపై నేతల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. వీటి ఆధారంగా ఇప్పటికే జిల్లాలవారీగా నేతల జాబితాను సిద్ధం చేసినప్పటికీ వరుసగా వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో అవి కాస్తా వాయిదా వేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం డీసీసీల నియామకం పూర్తి కావడంతోపాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం, నేతల సమిష్టి కృషితో 70శాతం ఆధిక్యాన్ని నమోదు చేసిన నేపథ్యంలో పార్టీ అభ్యున్నతికి కృషిచేసిన వారిని పదవులతో సంతృప్తిపరచాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత తొందరలో వాటిని భర్తీ చేస్తే ఔత్సాహికులను ప్రోత్సహించినట్లు అవుతుందని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గత ఏడాదే సీఎం ప్రకటన
వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించారు. మార్చి 10వ తేదీలోగా అన్ని జిల్లాలలో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి మంచి రోజులు రాబోతున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడి పనిచేసినా.. కొంతమందికి అవకాశాలు రాలేదన్నారు. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి పేర్లతో మార్చి 10లోగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. పనితీరు సక్రమంగా లేని నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో పదవుల రెన్యువల్ ఉండదని సీఎం తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే డీసీసీ అధ్యక్షుల నియామకంతోనే సరిపెట్టిన పెద్దలు.. నామినేటెడ్ పదవులను పక్కనపెట్టింది.


