- కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం
- చట్టాన్ని గవర్నర్ ఆమోదింపచేసే బాధ్యత బీజేపీదే
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర జనాభాలో 60 శాతంకుపైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. నేడు నలగొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
దుష్ప్రచారం మానుకోవాలి..
ఉన్న జనాభా కంటే 18 శాతం రిజర్వేషన్లు తక్కువ చేసి 42 శాతంతో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రెడ్డి జాగృతికి చెందిన వారు రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని, ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు గత 80 ఏళ్లుగా 90 శాతం పదవులు అనుభవిస్తూ బీసీల రావలసిన వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈనెల 8వ తేదీన రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ బీసీ రిజర్వేషన్ల అమలు కావంటూ కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు అదేపనిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
బీజేపీపైనే భారం..
బీసీ రిజర్వేషన్ల పెంచడానికి గవర్నర్ ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానానికి కలిసి విన్నవించామని బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదముద్ర వేసే బాధ్యత ఆ పార్టీ తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల పెంచే బాధ్యత బీజేపీ తీసుకోవాలని, రిజర్వేషన్లు ఆగిపోతే దానికి ఆ పార్టీనే బాధ్యత ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కేశ బోయిన శంకర్ ముదిరాజ్ , నకరికంటి కాశయ్య గౌడ్, జెల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, గోలి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


