రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు!
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ , కొత్తగూడెం రూరల్ : 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర వేడుకలకు శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల వెనుక అనేక మంది పోరాటయోధుల త్యాగం దాగి ఉందని ఎస్పీ గుర్తు చేశారు. ఆ త్యాగాలకు గౌరవంగా మన వంతు బాధ్యతగా దేశ సేవకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో పోలీస్ వ్యవస్థకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు.
విధుల్లో నిబద్ధత అవసరం
పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్రజలకు న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ వ్యవస్థకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్తో పాటు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆర్ఐలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయి.


