- విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలి
- ఖాకీలంతా నైతిక విలువలు పెంపొందించుకోవాలి
- అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
- ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం
- మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
- సీఎం రేవంత్ రెడ్డి
- పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి ఘన నివాళి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : పోలీస్ అంటే సమాజానికి నమ్మకం, భరోసా అని, శాంతిభద్రతలు కాపాడటంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన కోసం రక్తం అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సీఎం అన్నారు. హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ముందుందని వివరించారు. ఈక్రమంలోనే ఇటీవల అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగతా మావోయిస్టులను కోరుతున్నానన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులకు అండగా ప్రభుత్వం

1959 అక్టోబరు 21న భారత్, చైనా సరిహద్దుల్లో 10 మంది జవాన్లు వీరమరణం పొందారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అప్పటి నుంచి ఏటా ఈరోజు పోలీసు అమరవీరులను స్మరించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరుగురు పోలీసులు వీరమరణం పొందారని వెల్లడించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటీవల చనిపోయిన ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటిస్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానం

పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్ పేరుతో ప్రత్యేక బృందం నియమించామన్న ఆయన, సైబర్, డిజిటల్, మార్ఫింగ్, డ్రగ్స్లో కొత్త తరహా నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. టెక్నాలజీ రూపంలో వచ్చే నేరాలకు దాంతోనే సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు.
జాగ్రత్తగా వ్యవహరించాలి

“అనేక విభాగాలకు మహిళా ఐపీఎస్లు సారథ్యం వహిస్తున్నారు. పోలీసు డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితం త్యాగం చేస్తున్నారు. పోలీసు సంక్షేమం కోసం మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాజకీయ జోక్యం, ఒత్తిడి లేకుండా పని చేయాలని కోరాం. మా ప్రభుత్వం 16 వేల మంది కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు భర్తీ చేసింది. పోలీసులకు ఏదైనా జరిగితే దేశంలోనే అత్యధిక పరిహారం ఇస్తున్నాం. పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశాం. పోలీసులు తమ విధి నిర్వహణలో పారదర్శకత, నైతిక విలువలు పాటించాలి. ఇలాగే పని చేస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుతున్నాను. శరవేగంగా అభివృద్ధి చెందే మన రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా కీలకం. సోషల్ మీడియా యుగంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చూడాలి.” – రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి


