పోలీసుల ఆరోగ్యం అత్యంత కీలకం ఎస్పీ మహేష్ బి. గితే
పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం
కాకతీయ, సిరిసిల్ల : శాంతి,భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో శరత్ మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం సిబ్బందితో పాటు స్వయంగా వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు.ఎస్పీ మాట్లాడుతూ.పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని, కష్టతరమైన విధుల్లో ఉన్న నేపథ్యంలో సమయానుకూలంగా ఆరోగ్య పరీక్షలు జరుపుకోవడం అవసరమని సూచించారు. పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.శిబిరంలో పాల్గొన్న నేత్రవైద్యుల బృందం కంటి ఆరోగ్య పరీక్షలు, దృష్టి లోపాల నిర్ధారణ, అవసరమైన మందులు, సూచనలు అందించారు. రోజువారీ ఒత్తిడి, ఫీల్డ్ డ్యూటీలు, రాత్రిపూట పనులు వంటి కారణాలతో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ శిబిరం ఎంతో ఉపయుక్తమని వైద్యులు పేర్కొన్నారు.ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శరత్ మ్యాక్సీ విజన్ యాజమాన్యంతో పాటు వైద్య నిపుణులు, సిబ్బందికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, రవి, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్ఐలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


