సాహితీ వేదికపై నెల్లికుదురు కవయిత్రి వెంకటలక్ష్మి
తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు ప్రత్యేక ఆహ్వానం
‘పాట–చర్చ’ కార్యక్రమంలో పాల్గొననున్న ఆధునిక భావ కవయిత్రి
ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో కళా ప్రదర్శనకు అవకాశం
అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తూనే సాహిత్య సేవ
కాకతీయ, నెల్లికుదురు : తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలకు నెల్లికుదురు మండలానికి చెందిన ఆధునిక భావ కవయిత్రి, గాయకురాలు తొట్ల వెంకటలక్ష్మికి ఆహ్వానం అందింది. ఈనెల 21న హైదరాబాద్ గగన్ మహల్ ప్యాలెస్లోని ఏవీ కళాశాలలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగే ‘పాట–చర్చ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్వాహకులు ఆమెను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి తనకు లభించిన ఈ అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ సాహితీవేత్త పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవాల్లో మౌనశ్రీ మల్లిక్, యోచన, పల్లె నరసింహ, సాంబరాజు, యాదగిరి తదితర ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. సాహిత్య వేదికపై తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
అంగన్వాడీ టీచర్గా విధులు.. సాహిత్యమే అభిరుచి
నెల్లికుదురు మండలంలోని వస్రాం తండా పరిధిలోని లాలు తండాకు చెందిన వెంకటలక్ష్మి అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సాహిత్యాన్ని అభిరుచిగా కొనసాగిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా కవితలు రచిస్తూ, పాటలు ఆలపిస్తూ సాహిత్య వేదికలపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సాహిత్య, గాన ప్రతిభతో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతిభగా గుర్తింపు పొందిన వెంకటలక్ష్మి సాహితీ ఉత్సవాలకు ఆహ్వానం అందుకోవడం స్థానికంగా ఆనందాన్ని కలిగించింది.


