పీఎం సూర్య ఘర్ ను సద్వినియోగం చేసుకోవాలి
ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
కాకతీయ, పెద్దపల్లి : పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం ప్రాంగణంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి కార్పొరేషన్ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి విద్యుత్ వినియోగదారుడు తమ ఇళ్ల రూఫ్పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని, కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో పథకంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 10 మంది లబ్ధిదారులు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మూడు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ అందిస్తుందని, దీని ద్వారా ప్రతి నెల దాదాపు రూ.2 వేల వరకు విద్యుత్ బిల్లు ఆదా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి. గంగాధర్, డీఈ రాజ బ్రహ్మయ్యచారి, రెడ్కో జిల్లా మేనేజర్ డి. మనోహర్, జిల్లా సహకార అధికారి శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.


