శ్రీరామగిరి గుట్టపై శాశ్వత కరెంట్ వెలుగులు
చిరకాల సమస్యకు పరిష్కారం.. భక్తుల్లో ఆనందం వెల్లువ
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని శ్రీరామగిరి గ్రామంలోని పురాతన శ్రీరామలింగేశ్వర స్వామి గుట్టపై శాశ్వత కరెంట్ సౌకర్యం కల్పించినట్లు సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతరకు ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, గుట్టపై కరెంట్ లేక ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. గ్రామ ప్రజల చిరకాల కోరికను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాలతో విద్యుత్ శాఖ అధికారులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ నరేష్, డీఈ రవికుమార్, ఏడీఈ అశోక్, ఏఈ భార్గవి, జేఎల్ఎం శేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో గుట్టపై శాశ్వత విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కరెంట్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆలయం వెలుగులతో మెరిసిపోతుండగా, భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండదని గ్రామస్తులు తెలిపారు.


