నర్సంపేట మునిసిపల్ చైర్పర్సన్గా పెండెం శ్రీలక్ష్మి
కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీతో పీఠం కైవసం
వైస్ చైర్మన్గా గంధం నరేందర్.. ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్త పాలకవర్గం
నూతన నాయకత్వానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి శుభాకాంక్షలు
కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్గా 25వ వార్డు కౌన్సిలర్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్గా 7వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఆథరైజ్డ్ అధికారి, నర్సంపేట ఆర్డీవో పోలం ఉమారాణి అధికారికంగా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ముందుగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శాలువాలు, పూల బొకేలు అందించి సన్మానించారు.
కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం
మున్సిపాలిటీ మొత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ ఆధిక్యంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. పార్టీ పూర్తి సంఖ్యాబలంతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గంధం నరేందర్కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నూతన పాలకవర్గం స్పష్టం చేసింది


