ఒకవైపు పెద్దపులి… మరోవైపు చిరుత!
గజగజ వణుకుతున్న రాజన్న సిరిసిల్ల గ్రామాలు
పాడి పశువులపై వరుస దాడులు
ట్రాప్ కెమెరాలతో అటవీశాఖ నిఘా
అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచనలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అడవి మృగాల సంచారం ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. ఒకవైపు చిరుతపులి, మరోవైపు పెద్దపులి గ్రామాల సమీపంలో సంచరిస్తుండటంతో అటవీ ప్రాంత పల్లెల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ముఖ్యంగా పాడి పశువులపై దాడులు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హనుమక్కపల్లిలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. రైతు రోమాల భూమయ్య పశువుల పాకలో కట్టివేసిన ఆవు దూడపై దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాదముద్రలను పరిశీలించిన అధికారులు ఇది చిరుత దాడేనని నిర్ధారించారు. వేములవాడ అటవీ పరిధిలో సుమారు ఐదు చిరుతలు ఉన్నాయని, సాధారణంగా మనుషులపై దాడి చేయవని, ఆకలితో ఉన్నప్పుడు పశువులపై దాడి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
సిరిసిల్లలో పెద్దపులి భయం
ఇక సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల పరిధిలో తిప్పాపూర్–పెద్దలింగాపూర్ రహదారి సమీప గుట్టల వద్ద పెద్దపులి మూడు ఆవులు, ఒక దూడను హతమార్చింది. ఇటీవల సిద్దిపేట సరిహద్దు ప్రాంతాలు, తంగళపల్లి మండలంలో కూడా పులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. సిద్దిపేటలో సంచరిస్తున్న పులి, సిరిసిల్లలో కనిపించిన పులి ఒకటేనా? లేక వేర్వేరుగా ఉన్నాయా? అన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ట్రాప్ కెమెరాలతో నిఘా
జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. పులి, చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మృగాలను పట్టుకుని అడవిలోకి తరలించేందుకు ప్రత్యేక బృందాలను రప్పించారు. రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. రాత్రివేళల్లో పొలాల వద్ద నిద్రించవద్దని హెచ్చరించారు. పశువులను అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా సురక్షిత ప్రదేశాల్లో కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా పులి లేదా చిరుత అడుగుజాడలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఒకవైపు వేములవాడలో చిరుత, మరోవైపు సిరిసిల్లలో పెద్దపులి సంచారంతో గ్రామాలు భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ప్రస్తుతానికి అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


