కాకతీయ, ములుగు : సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 50 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావుకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో 50 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహనిర్మాణ శాఖకు 09, భూ సమస్యలు 08, ఉపాధి కల్పనకు 05, పెన్షన్ 05, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించారు. కాగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పరివాహక మండలాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల పరిధిలోని గ్రామాల అధికారులు, ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉదృతంగా పారుతున్న గోదావరి కారణంగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు.
ఈ నెల 6 వరకు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాకాలం, వరదల దృష్ట్యా తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.


