కాల్వలు మూసుకుపోయినా అధికారుల మూగ వైఖరి
నర్సంపేట కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్
కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూర్తిగా పూడుకుపోవడంతో మురుగు నీరు నిల్వై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆరోపించారు. కాల్వలు చెత్తతో మూసుకుపోవడంతో నీరు ఒకేచోట నిలిచిపోయి దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు పెరిగి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం నాలుగు రోజులుగా జేసీబీ యంత్రాన్ని ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ఆయిల్ మార్చాలనే కారణంతో పనులు వాయిదా వేస్తున్నారని కౌన్సిలర్ విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు సాకులు చెప్పడం దురదృష్టకరమని అన్నారు.
జేసీబీ మరమ్మతులు వెంటనే పూర్తి చేసి కాల్వల శుభ్రపరిచే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అత్యవసరంగా స్పందించాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు.


