ఆఫీస్లు పరిశుభ్రంగా ఉండాలి
రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
కలెక్టరేట్ ప్రతి అంతస్తులోని కార్యాలయం తనిఖీ
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత .. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డంనగేష్ తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


