భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన
ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు
దాతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
కాకతీయ, వరంగల్ సిటీ : వసంత నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఘనంగా నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఓరుగల్లు మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానంలో జరుగుతున్న వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారంతో ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం అనంతరం కల్పోక్త విధానంలో జపహోమాలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.
వైభవంగా లక్షపుష్పార్చన
అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో లక్షపుష్పార్చన నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పాజూరి శ్రీరాం శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ స్రవంతి, బీయాల అంజన్న అక్షర పాల్గొన్నారు. దేవాలయ ధర్మకర్తలు మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, అనంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు. పూజ అనంతరం దాతలకు అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి ప్రసాదాలు ఇచ్చినట్లు దేవస్థాన ఈవో రామల సునీత తెలిపారు.


