శివపార్వతుల కల్యాణానికి పుస్తె మెట్టల అందజేత
తాళ్ల ఊకల్ ఉమామహేశ్వర ఆలయంలో వైభవంగా కళ్యాణం
కాకతీయ,మరిపెడ: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని తాళ్ల ఊకల్ గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ కళ్యాణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఈ సందర్భంగా మరిపెడకు చెందిన లక్ష్మీ సరస్వతి జ్యువెలరీ యజమానులు తాడూరి రమేష్–సరస్వతి దంపతులు స్వామివారి కళ్యాణానికి పుస్తె మెట్టలు సొంత ఖర్చులతో సమర్పించారు. ఈ దంపతులు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తప్పెట్ల శ్రీను, ఉప సర్పంచ్ బోర మల్లయ్య, భూక్య కాల్య నాయక్, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.


