రాష్ట్ర సాధకుడికి నోటీసులా..?!
కాంగ్రెస్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం
కేసీఆర్ను అవమానించేందుకే ఈ కుట్రలన్నీ
కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ యత్నం
భయభ్రాంతుల పాలనకు బీఆర్ఎస్ భయపడదు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల గుణపాఠం తప్పదు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
కాకతీయ, నర్సంపేట టౌన్ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, స్వప్నికుడు కేసీఆర్కు నోటీసులు పంపడం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయాలే ఉన్నాయని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విచారణ పేరుతో కేసీఆర్ను అవమానించడమే లక్ష్యంగా రేవంత్రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నుంచి తప్పించుకునేందుకే రోజుకో కొత్త నాటకానికి తెరలేపుతోందని విమర్శించారు. తెలంగాణలో పాలన కాకుండా రోజుకో ‘చలనచిత్రం’లా రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్పై నోటీసుల పేరిట రాజకీయం చేస్తున్నారని సుదర్శన్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాలను మలినం చేసిన ఘనత రేవంత్రెడ్డికే దక్కుతుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కోర్టు విచారణకు భయం!
కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలపై కోర్టులు స్వయంగా విచారణకు ఆదేశించినా, వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు వెనక్కి తగ్గుతున్నారని ఆరోపించారు. నిజాలు బయటకు వస్తాయన్న భయంతోనే విచారణకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ తరఫున స్పష్టంగా, గర్వంగా చెబుతున్నామని అన్నారు. ప్రజలను మభ్యపెట్టే దొంగ నాటకాలు, అబద్ధపు ప్రచారాలకు ఇక కాలం చెల్లిందని హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో స్థానిక నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని తమ పార్టీ దృష్టికి వచ్చిందని సుదర్శన్రెడ్డి తెలిపారు. అర్ధరాత్రి వేళల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించడం వంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ తరహా భయపెట్టే రాజకీయాలకు తమ పార్టీ ఏమాత్రం భయపడదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడతామని, ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ చర్యలు లేకుండా నర్సంపేటలో నిర్మలమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఏకపక్ష పాలనకు, దోపిడీ రాజకీయాలకు ముగింపు పలకాలన్నదే నర్సంపేట ప్రజల ఆకాంక్ష అని అన్నారు. ఆ ఆకాంక్షను నెరవేర్చగల శక్తి బీఆర్ఎస్ పార్టీకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే నర్సంపేట ప్రజలకు స్థిరమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం తప్పకుండా అందుతుందని మరోసారి స్పష్టం చేశారు. రేపు ఉదయం నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అన్ని స్థానాల అభ్యర్థుల వివరాలను ప్రకటించి ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు సభాముఖంగా తెలిపారు. ప్రజలే తమ బలం, ప్రజలే తమ ఆశయమన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి కేసీఆర్ గౌరవాన్ని నిలబెట్టాలని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలు అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, ఎన్నికల కన్వీనర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


