- కాంగ్రెస్ అంటేనే కరెంట్… కరెంట్ అంటేనే కాంగ్రెస్
- ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసేవాళ్లు తీగలను ముట్టుకుని చూడాలి
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు ప్రజాబాట
- బీఆర్ఎస్ పాలన లో అన్ని వ్యవస్థలు నాశనం
- పరిగిలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- పరిగి నియోజకవర్గం లో వెయ్యి కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అంటేనే కరెంటు అని, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతో పాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బుధవారం పరిగి నియోజకవర్గం లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ను 53 లక్షల కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 2 లక్షల 47 వేల 777 కుటుంబాలకు గాను నిరుపేదలైన 1 లక్ష 43 వేల 190 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 44,500 కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ను అందిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును నిరుపేదలకు అందిస్తున్నామని దీనికి సంబంధించి 42 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందన్నారు.

ఈ విధంగా ప్రతి నెల గృహ జ్యోతి పథకం కోసం రాష్ట్ర నిరుపేద ప్రజల కోసం 2830 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని తెలిపారు. పరిగి నియోజకవర్గం లో 1000 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులను మంజూరు చేశామన్నారు. వారికి నియోజకవర్గానికి 9 సబ్ స్టేషన్ లతోపాటు 33/11 కెవి, 400kv సబ్ స్టేషన్ తో పాటు 220 కెవి సబ్ స్టేషన్ ను మంజూరు చేశామన్నారు. పరిగి నియోజకవర్గం అభివృద్ధి కోసం రామ్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నాడు అన్నారు. నా వెల్ ప్రాజెక్టుకు సంబంధించిన మూడు వేల కోట్ల సాధన కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, అయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పట్టించుకోలేదన్నారు. డిఫెన్స్ కు సంబంధించి 3000 కోట్లు రావడం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తులో పరిగి నియోజకవర్గం లో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం విద్యుత్తు సబ్ స్టేషన్ లు పెద్ద ఎత్తున మంజూరు చేశామని వాటికి భూమి పూజ కూడా చేశామన్నారు.
రోడ్డెయకుండా బీఆర్ ఎస్ నిర్లక్ష్యం…!
ఉమ్మడి రాష్ట్రంలోనే మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు మంజూరు అయిందని, అయితే గతం పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్జీటీ 2 లో ఉన్న కేసును గత నెల 30న తొలగించడం కోసం కృషి చేయడం వల్ల నాలుగు లైన్ల రహదారి పనులు వడివడిగా నడుస్తున్నాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయించామని, రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలకు తాను చాలెంజ్ విసురు తున్నానని అన్నారు. ఏ నియోజకవర్గానికి వచ్చిన ఇండ్ల నిర్మాణం చూపిస్తానని తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 93 లక్షల కుటుంబాలకు రూ. 10 లక్షలతో ఈ ఆసుపత్రికి వెళ్లిన వైద్యం చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు ప్రజాబాట నిర్వహించ బోతుందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులే ప్రజల వద్దకు వెళ్తారని అంబులెన్స్ లాగా ఒక వాహనం కూడా ఉంటుందన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచబోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరని ఏ ఒక్క ప్రతిపక్షం కూడా ఆపలేదని స్పష్టం చేశారు.


