తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు
షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా
రవీందర్ సింగ్ ఆరోపణలు అసత్యం
డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్ : నగరంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగుతుందని, దాని పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ప్రజలకు దినం తప్పి దినం షెడ్యూల్ ప్రకారం 45 నిమిషాల నుంచి గంటపాటు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ.రాజకీయ లాభం కోసం సర్ధార్ రవీంధర్ సింగ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో ఎక్కడా రెండు మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరగడం లేదని,ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.ఇరిగేషన్ శాఖ నిర్ణయాల కారణంగా లోయర్ మానేరు డ్యాం నుంచి నీటిని దిగువకు వదలడం జరుగుతోందని, దీని వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశముందని తెలిపారు. మిడ్ మానేరు లేదా ఎస్సారెస్పీ ద్వారా లోయర్ మానేరు డ్యాంకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నీటి విడుదలను నియంత్రించాలని జిల్లా కలెక్టర్ను విజ్ఞప్తి చేశారు.మానేరు డ్యాంలో కనీసం 10 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే పాలకవర్గం మొత్తం ఆందోళనకు దిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. త్రాగునీటి సరఫరా అంశంపై రాజకీయాలు చేయడం తగదని, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్రణాళికతో నగరంలో నీటి సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని తెలిపారు.


