కొమ్మాల జాతరకి కొత్త కాంతులు
నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల రద్దీ
జిగేల్మనే విద్యుత్ కాంతులతో ప్రభల శోభ
రాజకీయ సందడితో పెరిగిన ఆకర్షణ..హైటెన్షన్
ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ప్రత్యేక అలంకరణలతో వాహనాల ఊరేగింపులు
కాకతీయ, గీసుగొండ : ఒకప్పుడు ఎద్దుబండ్లు, కోలాటాల సందడితో కనిపించిన కొమ్మాల జాతర ఇప్పుడు విద్యుత్ కాంతుల వెలుగులతో, వాహనాల రద్దీతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. సంప్రదాయానికి ఆధునికత జోడై మూడు రోజుల పాటు ఈ జాతర ఉత్సాహంగా సాగుతోంది. ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ, రాజకీయ సందడి, కళాకారుల ప్రదర్శనలు జాతరకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఊరంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది. ఒకప్పుడు గ్రామస్తులు కుటుంబ సమేతంగా ఎద్దుబండ్లపై జాతరకు చేరుకునేవారు. ఇప్పుడు కాలం మారడంతో కార్లు, బైకులు, ట్రాక్టర్లు, ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల రద్దీతో కొమ్మాల మార్గాలు కిక్కిరిసిపోతున్నాయి. అయితే కాలం మారినా భక్తి ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

వెల్లివిరిసిన ప్రభల శోభ
జాతరలో ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రంగురంగుల కాంతులతో తీర్చిదిద్దిన ప్రభలు రాత్రివేళల్లో మరింత అందంగా మెరిసిపోతూ భక్తులను అలరిస్తున్నాయి. ప్రతి వర్గం తమ ప్రభను ప్రత్యేకంగా అలంకరించేందుకు పోటీపడుతుండటం జాతర ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. జాతరలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనడంతో సందడి మరింత పెరిగింది. తమ వర్గాల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపులో పాల్గొనడంతో హడావుడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ
ప్రతి సంవత్సరం కొమ్మాల జాతరకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సమీప మండలాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత ఏడాది సుమారు ఐదు లక్షల మంది భక్తులు జాతరలో పాల్గొన్నట్లు అంచనా. ఈ ఏడాది కూడా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, వేషధారణలు, డప్పుల మోత జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభ బండ్ల ముందు యువతులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అయితే రికార్డింగ్ నృత్యాలు నిషేధం ఉన్నప్పటికీ కొందరు వర్గాలు నిర్వహించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభ బండ్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ కంటైనర్లపై ఏర్పాటు చేసిన లైటింగ్ అలంకరణలు, భారీ తెరలతో కూడిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాల ఛత్రిలతో అలంకరించిన ఊరేగింపులు జాతరకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇలా సంప్రదాయం, ఆధునికత కలయికతో కొమ్మాల జాతర ప్రతి ఏడాది కొత్త కాంతులతో భక్తులను అలరిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది.



