నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలి
జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలి
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
లోక్సభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ
కాకతీయ, కూసుమంచి : నేలకొండపల్లి బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేసి జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్ లో చేర్చాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ ప్రాచీన కట్టడాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. సోమవారం లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలో కీలక బౌద్ధ వారసత్వ క్షేత్రమని చెప్పారు. శాతవాహన, ఇక్ష్వాకు కాలానికి చెందిన ఈ కట్టడం చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉందన్నారు. తవ్వకాలలో మహాస్తూపాలు, విహారాలు, ఇటుక నిర్మాణాలు, బుద్ధ విగ్రహాలు, నాణేలు బయటపడటం దీని గొప్పతనాన్ని తెలియజేస్తుందని వివరించారు.
సదుపాయాల కల్పనపై సూచనలు
ఈ స్థలం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రహదారులు, సూచిక బోర్డులు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. నిర్మాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమగ్ర సంరక్షణ చేపట్టాలని సూచించారు. మ్యూజియం, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. నేలకొండపల్లిని జాతీయ బౌద్ధ పర్యాటక వలయంలో చేర్చితే దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తెలంగాణలో సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని రామసహాయం రఘురాం రెడ్డి విజ్ఞప్తి చేశారు.


