కాకతీయ, నేషనల్ డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశ రక్షణ రంగంలో ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 2035నాటికి సుదర్శన చక్ర పేరుతో ఒక అత్యాధునిక ఆయుధ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రధాని వెల్లడించారు. ఈ శక్తివంతమైన సాంకేతిక రక్షణ కవచం దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు పూర్తి భద్రతను కల్పిస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
శ్రీక్రిష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్పూర్తితో ఈ మిషన్ కు పేరు పెట్టినట్లు ప్రధాని తెలిపారు. ఇది భారత రక్షణ వ్యూహంలో ఒక సాహసోపేతమైన మార్పుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా వచ్చే 10ఏళ్లలో దేశానికి ఒక పటిష్టమైన సుదర్శన చక్ర కవచాన్ని నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. 2035 నాటికి ఈ జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించి, బలోపేతం చేసి, ఆధునీకరిస్తామన్నారు. దీనికోసం దేశం సుదర్శన చక్ర మిషన్ ను ప్రారంభిస్తుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ మిషన్ లో భాగంగా శుత్రవుల దూకుడును అడ్డుకోవడమే కాదు..శక్తివంతమైన ప్రతిదాడి చేసేందుకు వీలుగా కచ్చితమైన లక్ష్యాలను చేధించే వ్యవస్థ, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోనున్నట్లు మోదీ వివరించారు. రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నింటిని ఈ జాతీయ భద్రతా కవచం కిందకు తీసుకువస్తామని ప్రధాని మోదీ వివరించారు.
కాగా గత 10ఏళ్ల కాలంలో అభివ్రుద్ధి చేసిన టెక్నాలజీతో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్ల్స్ ను భారత్ సమర్ధవంతంగా నిలువరించిందన్నారు. యుద్ధ రంగంలో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో భారత సైనిక శక్తిని నిరంతరం మెరుగుపరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.


