నా క్యాడర్ మొత్తం నా వెంటే ఉంది
తేనీటి విందు రాజకీయాలతో మాకేమీ నష్టం లేదు
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మంత్రి సురేఖ పరోక్ష విమర్శలు
మంత్రి వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ వర్గపోరు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన అనుచరులను తమ వైపు తిప్పుకుంటున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బలహీనులు బలవంతుల వెనుక పడతారని, మేము బలవంతులం కాబట్టే మమ్మల్ని ఎదుర్కోలేక మా వెనుక గోతులు తవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి రాజకీయాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని, తన క్యాడర్ మొత్తం తన వెంటే ఉందని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో చిన్నచిన్న రాజకీయాలను తాను పట్టించుకోనని తెలిపారు.
అభివృద్ధిపై మంత్రి హామీలు
తూర్పు నియోజకవర్గ అభివృద్ధి విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఎల్–1 కేటగిరీలో అర్హులైన వారికి ఇప్పటికే ఇండ్లు కేటాయించామని, కొందరి పేర్లు పెండింగ్లో ఉండటంతో రీవెరిఫికేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థలాలు ఉన్నవారికీ, ఇండ్లు లేని నిరుపేదలకూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. స్థలం లేని వారికి రెండు పడక గదుల గృహాలు కేటాయిస్తామని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 2,200 ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి అనుగుణంగా యూజీడీ, ఐడీఓసీ, సమీకృత పాఠశాలల పనులను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రూ.200 కోట్లతో నియోజకవర్గానికి కేటాయించిన రెసిడెన్షియల్ స్కూల్ కోసం వర్ధన్నపేట పరిధిలో స్థలాన్ని ఎన్ఓసీ ద్వారా కలెక్టర్ అనుమతి ఇచ్చారని, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.15 వేల చొప్పున త్వరలో ఆర్థిక సహాయం అందిస్తామని, దీనికి తహసీల్దార్ల ద్వారా జాబితాలు సిద్ధమవుతున్నాయని మంత్రి వెల్లడించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నియోజకవర్గంలోని 32వ డివిజన్ కరీమాబాద్లో సైడ్ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే కాశీకుంట, నాగయ్య టెంపుల్ ఏరియా, అబ్బని కుంట ప్రాంతాల్లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఖిలా వరంగల్ కోటలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ఆధ్వర్యంలో మోటు పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా స్పాంజ్ పార్క్, రాతి కోట చుట్టూ రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కార్పొరేటర్లు పల్లం పద్మ, రవి, పోశాల పద్మస్వామి, భోగి సువర్ణ సురేష్, ఉమ, దామోదర్ యాదవ్, సోమిశెట్టి ప్రవీణ్కుమార్, తహసిల్దార్ మహ్మద్ ఇక్బాల్, డీఈ రంగారావు, బోయిని దూడయ్య, గజ్జల శ్యామ్, భైరబోయిన రవి, పోశాల సారంగపాణి, సంగరబోయిన చందర్ తదితరులు పాల్గొన్నారు.


