వాహనదారులు క్రమం తప్పకుండ కంటి పరీక్షలు చేయించుకోవాలి
* ఎస్సై గూడా అపూర్వ రెడ్డి
* లారీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు
కాకతీయ, చేర్యాల: సిద్దిపేట పోలీస్ కమీషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చేర్యాల పట్టణంలోని లారీ డ్రైవర్ల కోసం విజయ కంటి హాస్పత్రిలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్సై గూడ అపూర్వ రెడ్డి సందర్శించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో స్పష్టమైన కంటి చూపు ప్రాముఖ్యతను ఎస్సై అపూర్వ రెడ్డి లారీ డ్రైవర్లకు వివరించారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.లారీ డ్రైవర్లకు ఎస్సై పలు కీలక సూచనలు చేశారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, రక్షణాత్మక డ్రైవింగ్ పాటించాలని తెలిపారు. ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయడం ప్రమాదకరమని, అతివేగం ప్రాణాంతకమని హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్ నిషేధమని, మద్యం సేవించి వాహనం నడపడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల పై వివరించారు.మొబైల్ ఫోన్లను రక్షించేందుకు పౌచ్లు, స్క్రీన్ గార్డులు ఉపయోగిస్తున్నప్పటికీ, తమ ప్రాణ రక్షణకు అవసరమైన హెల్మెట్, సీట్ బెల్ట్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. సురక్షితంగా గమ్యం చేరడం, ప్రాణాలతో ఉండటమే లక్ష్యమని తెలిపారు. ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని సూచించారు. అందరూ ట్రాఫిక్ నియమా ఖచ్చితంగా పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఎస్సై అపూర్వ రెడ్డి పిలుపునిచ్చారు.


