అంగన్వాడీలకు ఆధునిక సదుపాయాలు పిల్లల హాజరు పెంపే లక్ష్యం
మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని తీగలగుట్టపల్లి 1వ అంగన్వాడీ కేంద్రంలో ‘సాక్షం అంగన్వాడీ’ కార్యక్రమంలో భాగంగా తాగునీటి శుద్ధి యంత్రాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని 269 అంగన్వాడీ కేంద్రాలకు ఒక్కొక్కటికి లక్ష రూపాయల వ్యయంతో ఎల్ఈడీ టీవీలు, చిన్నారుల ప్రారంభ విద్యా సామగ్రి, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, బాలల చిత్రలేఖనం, పోషణ తోటల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో 35 అంగన్వాడీ కేంద్రాలకు ఈ సదుపాయాలు అందించనున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడం ద్వారా పిల్లల హాజరు శాతం పెరిగేలా సిబ్బంది కృషి చేయాలని మేయర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ చిన్నారులకు పురోగతి కార్డులు పంపిణీ చేశారు. చిన్నారుల ప్రతిభను ప్రతిబింబించిన ప్రారంభ విద్యా మేళాలో వారి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో సీడీపీఓ సబిత, పర్యవేక్షకురాలు రాజమణి, అంగన్వాడీ ఉపాధ్యాయులు శ్రీలత, రాజమణి, కనకలక్ష్మి, జిల్లా మహిళా సాధికార బృంద సిబ్బంది కవిత, శైలజతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


