భూపాలపల్లి చింతకానిలో అద్భుతం
వాగులో విష్ణుమూర్తి పొలికలతో ఉన్న విగ్రహం లభ్యం
వేల ఏళ్ల నాటి విగ్రహమంటూ స్థానికుల అభిప్రాయం
గ్రానైట్ రాయిపై అద్భుతమైన శిల్పా కళా నైపుణ్యంతో విగ్రహం
విగ్రహం లభ్యంతో స్థానిక చరిత్రపై మొదలైన శోధన
రంగంలోకి పురావస్తు శాఖ అధికారులు
నివేదిక,పరిశోధనలపై దృష్టి
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వాగులో పురాతన విగ్రహం బయటపడటం సంచలనంగా మారింది. వాగులో నీరు తగ్గిన సమయంలో స్థానికులు ఈ విగ్రహాన్ని గుర్తించారు. నల్లరాతితో అద్భుతంగా చెక్కిన ఈ శిల్పం చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని ప్రాథమికంగా పరిశీలించారు. విగ్రహం నల్ల గ్రానైట్ రాతితో తయారైందని, శిల్పకళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తోంది. చేతులు, కిరీటం, అలంకరణ తీరు చూసి ఇది విష్ణుమూర్తి లేదా చెన్నకేశవ స్వామి విగ్రహమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. విగ్రహం దాదాపు సమగ్రంగా ఉండటం విశేషం.

ఏ కాలానికి చెందినది?
పురావస్తు నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ విగ్రహం సుమారు పదకొండో లేదా పన్నెండో శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని భావిస్తున్నారు. కళ్యాణి చాళుక్యుల కాలం లేదా ప్రారంభ కాకతీయుల కాలంలో ఈ శిల్పం చెక్కబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. శిల్ప నిర్మాణంలో కనిపిస్తున్న నాజూకుతనం ఆ కాలపు కళారీతిని సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పురావస్తు శాఖ శాస్త్రీయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉంది. స్థానికులు ఈ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తరలించి పూజలు నిర్వహించాలని కోరుతున్నారు. అయితే అధికారులు ముందుగా శాస్త్రీయ పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. భద్రతా పరమైన చర్యలు తీసుకుని విగ్రహాన్ని సంరక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వాగులో బయటపడిన ఈ విగ్రహం ప్రాంత చరిత్రపై కొత్త కోణాలను తెరపైకి తీసుకువచ్చింది. అధికారుల తుది నివేదిక వెలువడితే ఈ శిల్పం వెనుక ఉన్న అసలు చరిత్ర ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ విగ్రహం చుట్టూ ఆసక్తి, ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.


