మిస్సింగ్ల మిల్స్ కాలనీ
ఖాకీ నిఘా కరువు… కేటుగాళ్ల వీరంగం
గంజాయి మత్తులో ఆకతాయిల రౌడీయిజం
పెరుగుతున్న దొంగల స్వైర విహారం
స్టేషన్పై పెరుగుతున్న నిఘా భారం.. భద్రత ప్రశ్నార్థకం
సిబ్బంది కొరతతో క్షీణించిన శాంతిభద్రతలు
స్టేషన్ పునర్విభజన ఏర్పాటు ఎప్పుడంటూ ప్రజల డిమాండ్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి నేరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గంజాయి మత్తు, బెల్ట్ షాపులు, వరుస దొంగతనాలతో అశాంతికి కేంద్రంగా మారింది. రాత్రి9 తర్వాత నగరంలోనే భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. ఖాకీ నిఘా బలహీనపడడంతో కేటుగాల్లు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖిలా వరంగల్ పరిధిలోని పడమర కోట చమాన్ వద్ద జరిగిన తాజా ఘటన పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. మద్యం మత్తులో ఉన్న యువకులు స్వీట్ షాపులోకి చొరబడి యజమానితో ఘర్షణకు దిగారు. దుర్భాషలాడుతూ షాపు సామగ్రిని ధ్వంసం చేశారు. వేయింగ్ మెషిన్ పగలగొట్టి సరుకులను రోడ్డుపై పారేశారు. ఇదొక్కటే కాదు మిల్స్ కాలనీ పరిధిలో ఇటీవల జరిగిన ఘర్షణల్లో గంజాయి మత్తులో యువకులు పరస్పరం బీరు సీసాలతో దాడులు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు కలిగించింది. చిన్న కారణాలకే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అల్లరి మూకలు, ఆకతాయిల స్వైర్య విహారం, గంజాయి సేవనంలో మైమరిచిపోయి దౌర్జన్యాలకు దిగుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు ఇప్పుడు వరంగల్లో సర్వత్రా వినిపిస్తున్నాయి.

అర్ధరాత్రి మద్యం విక్రయాలు..!
నిబంధనల ప్రకారం రాత్రి సమయంలో మూతపడాల్సిన మద్యం దుకాణాలు, బార్లు ఉర్సు రోడ్డులో అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి. మద్యం మత్తులో యువకులు గుంపులుగా చేరి గల్లీల్లో హడావిడి చేయడం, అసభ్య పదజాలంతో కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యంగా మారింది. బెల్ట్ షాపులే ఈ నేరాలకు మూలకారణమన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. శివనగర్లో బైక్ల నుంచి పెట్రోల్ దొంగతనాలు, కరీమాబాద్లో కార్ల అద్దాల ధ్వంసం వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాళం వేసిన ఇళ్లను దోపిడీకి దుండగులు ఎంచుకుంటూ దోచుకెళ్తున్నారు. ఇక అధికారంలో ఉన్న వారికి సలాం కొట్టాల్సిందేనన్నట్లుగా కొంతమంది నేతలు వ్యవహరిస్తుండటంతో.. పోలీసు విధులకు ఆటంకంగా మారుతోంది. నేరాలకు పాల్పడిన వారిని స్టేషన్కు తీసుకొచ్చని వెంటనే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్లు, పైరవీలు, సెటిల్ చేయాలని ఒత్తిళ్లు పెరుగుతుండటంతో… ఖాకీలు సైతం అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా నలిగిపోతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న మిస్సింగ్ కేసులు..!
ఇదే సమయంలో మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు ఇద్దరు చిన్నారులు అదృశ్యమవడం భద్రతా వ్యవస్థపై తీవ్ర సందేహాలు రేకెత్తించింది. సుమారు ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వేల సంఖ్యలో జనాభా ఉన్న ఈ పరిధికి ఒక్క పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండటం ప్రధాన లోపంగా మారింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిని రెండుగా విభజించి కొత్త స్టేషన్ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నా.. ఇప్పటి వరకు అమలు కావడం లేదు. దీంతో శాంతిభద్రతల పరిరక్షణ స్టేషన్ అధికారులకు సవాల్గా మారింది. సరిపోను పోలీస్ సిబ్బంది కూడా లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా మిల్స్ కాలనీ పరిస్థితి నియంత్రణ తప్పే దశకు చేరుకుంది. తక్షణమే అదనపు సిబ్బంది నియామకం, రాత్రి నిఘా బలోపేతం, గంజాయి, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు చేపట్టకపోతే చిన్న ఘటనలు పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని జనాలు హెచ్చరిస్తున్నారు.


