మెట్టుగుట్ట శివరాత్రి జాతర టెండర్లు ఖరారు
లడ్డు–పులిహోర హక్కు రూ.90 వేలకు వేలం
కొబ్బరికాయలు, చెరుకు బండ్ల వేలం వాయిదా
కాకతీయ, మడికొండ : వరంగల్ మహానగరంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మెట్టుగుట్ట ఆలయంలో 2026 మహాశివరాత్రి జాతర ఉత్సవాల నిర్వహణకు సంబంధించి శుక్రవారం టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ప్రక్రియ చేపట్టారు. జాతర సందర్భంగా లడ్డు–పులిహోర విక్రయ హక్కును రూ.90,000కు వరంగల్కు చెందిన ఎన్.ప్రసాద్ అత్యధిక బిడ్తో దక్కించుకున్నారు. అలాగే అభిషేకం పంచామృతాల విక్రయ హక్కును గుండేడుకు చెందిన బి.రాఘవులు రూ.35,000కు పొందినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయితే కొబ్బరికాయల విక్రయం, చెరుకు బండి నిర్వహణకు సంబంధించిన వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో ఆయా పాటలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం 2026 మహాశివరాత్రి జాతర గోడ పత్రికలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, కుడాచైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. అర్చకులు రాగిచేడు అభిలాష్ శర్మ, పరాశరం విష్ణువర్ధనాచార్యులు, పారుపల్లి సత్యనారాయణ శర్మతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


