క్రీడలతో మానసికోల్లాసం
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ ఈ-టెక్నో విద్యార్థులు
కాకతీయ, కరీంనగర్ : ఆర్చరీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన క్రీడగా నిలుస్తోందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో పలు రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నామని వివరించారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన డి. సుదీక్ష (9వ తరగతి), కె. లిశిత అక్షయ (8వ తరగతి), జి. శ్రీహరినాథ్ (8వ తరగతి), డి. శ్రీనిత్య (4వ తరగతి) ప్రతిభ కనబరిచి త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించి రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ చాటుకొని జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


