రూ. 200 కోట్లతో మేడారం ఆధునీకరణ
200 సంవత్సరాలు నిలిచేలా రాతి కట్టడాలు
కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు
సుమారు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం
మూడు దశల్లో 94 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శాశ్వత భవనాలు
శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్యదైవాలైన సమ్మక సారలమ్మ జాతర నేపధ్యంలో సుమారు 200 కోట్ల రూపాయిలకుపైగా ఖర్చుతో ఆధునీకరణ పనులు చేపట్టామని, ఇప్పటికీ దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ .. కనీసం 200 సంవత్సరాలకు పైగా నిలిచేలా రాతి కట్టడాలతో ఆధునీకరణపనులు చేపట్టామని వివరించారు. మేడారం చుట్టుపక్కల సుమారు 10 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే ఆధునీకరణ పనుల కోసం 29 ఎకరాల భూమిని అధికారికంగా సేకరించామని తెలిపారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో 63 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించామని వెల్లడించారు.
18న పనులు ప్రారంభం
ఈనెల 29 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర కోసం కుంభమేళాను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ మేడారం జాతర, ఏర్పాట్లు, ఆధునీకరణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తాను, ఈ ములుగు నియోజకవర్గ ప్రతినిధి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి పలు మార్లు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 18వ తేదీన మేడారం ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా శాసనసభ, శాసన మండలి సభ్యులను, మంత్రులు, స్పీకర్లను ఆహ్వానిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు..
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. శాసన మండలిలో సోమవారం ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సుదీర్ఘంగా జవాబు ఇచ్చారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించే పరిస్ధితికి తెరదించుతున్నాం. సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవస్ధ వలన అవినీతికి అడ్డుకట్టపడుతుంది. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను 94 అద్దె భవనాల్లో 50 ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్నాయి. మూడు దశల్లో వీటికి శాశ్వత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా పరిపాలనకు ఇబ్బంది లేకుండా అత్యాధునికంగా కార్పొరేట్ స్ధాయిలో సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను దశలవారీగా నిర్మిస్తున్నాం. మొదటి దశలో ఔటర్ రింగ్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 11 క్లస్టర్లుగా విభజించి సమీకృత సబ్ రిజిస్ట్రార్ భవనాలు నిర్మిస్తున్నాం… అన్నారు.
ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా..
ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రైవేట్ బిల్డర్స్ ఈ భవనాలను నిర్మించేలా ప్రణాళికలు తయారు చేశామని మంత్రి వివరించారు. ఒక్కో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. రెండో దశలో జిల్లా కేంద్రాలలో, మూడోదశలో నియోజకవర్గాలలో భవనాలను నిర్మిస్తాం. మొదటి ఐదు సంవత్సరాలు ఈ భవనాలను నిర్మించిన సంస్ధ మెయింటెనెన్స్ చేస్తుందని ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఖర్చు కూడా లేదు. స్లాట్ బుకింగ్ విధానం తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయం కూడా చాలావరకు తగ్గిందని ఒక్కో డాక్యుమెంట్కు 18 నుచి 21 నిమిషాల్లోనే పూర్తవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు


