- మామునూరు ఎయిర్పోర్టు పనులు వేగిరం
- నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తాం
- కేంద్ర విమానాయన శాఖ మంత్రి రాంమోహన్నాయుడు
కాకతీయ, వరంగల్ : మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు స్పష్టం చేశారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు, ఎయిర్ క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రిని కలసి వినతి పత్రం అందజేశారు. న్యూఢిల్లీలో రామ్మోహన్ నాయుడుని మంగళవారం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కు ఆమోదం తెలిపినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అలాగే, పెద్ద విమానాల రాకపోకలకు వీలు కల్పించేలా అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర మంత్రిని కోరారు. ఎయిర్ పోర్టు భూసేకరణకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్ల నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. ఆ భూమిని విమానాశ్రయ విస్తరణకు ఉచితంగా అందజేస్తుందని ఎంపీ తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధితో వరంగల్ ప్రజలకు మెరుగైన విమాన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. పర్యాటకం, వ్యాపారంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ లో విమానాశ్రయ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్ల తెలిపారు. రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన భూసేకరణ అనంతరం విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.


