వరంగల్లో భారీ అగ్నిప్రమాదం..
మంటల్లో ఫర్నిచర్ షాపు దహనం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి :వరంగల్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జె.పి.ఎన్ రోడ్ లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక దత్తాత్రేయ ఫర్నిచర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దత్తాత్రేయ ఫర్నిచర్ షోరూమ్ షాపులో ఫర్నిచర్ (చెక్క సామాగ్రి) ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


