బాసర ఆలయానికి మహర్దశ
శృంగేరి పీఠం నుంచి అనుమతులు
వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్
33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు
20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు ఆలయ విస్తీర్ణం
6 వేల మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, శౌచాలయాలు
70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్ల నిర్మాణం
రూ.225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతీదేవి ఆలయానికి మహర్ధశ పట్టింది. రూ. 225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు విస్తరించనున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణంలో అద్భుత శైలిని కలిగిన శిలలను ఉపయోగించనున్నారు. 6 వేల మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, శౌచాలయాలు తదితర వసతులతో 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తారు. 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా పెద్ద మందిరం, 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద విక్రయ కౌంటర్లు సహా ఈశాన్య దిక్కున మంచినీటి కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో విశాలమైన రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ది పనులతో బాసర ఆలయ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.

మాస్టర్ ప్లాన్ను రూపొందించిన అధికారులు
బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయ విస్తరణ పనులను చేసేందుకు అధికారులు రూ.225 కోట్లతో మాస్టర్ప్లాన్ రూపొందించారు. ఈ ప్లాన్లో ఆలయ పునరాభివృద్ధి నమూనాలోని ఒక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారమే విడుదల చేసింది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల అభివృద్ధి నిర్మాణాలకు సంబంధించి అనుమతులను శృంగేరి పీఠం నుంచి తీసుకున్నారు. వారి సూచనలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ను అధికారులు రూపొందించారు. ప్రస్తుతం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు విస్తరించనున్నారు. ఉత్తరం వైపు 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారాలను అభివృద్ధి చేయనున్నారు.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల పర్యటిస్తున్నారు. బజార్హత్నూర్ మండలం పిప్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్కు 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా సభ నిర్వహస్తిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జైనథ్లో రూ.20 కోట్లతో నిర్మించిన గురుకుల పాఠశాల బాలుర భవనం, ఆదిలాబాద్లో మైనారిటీ గురుకుల బాలికల విద్యాలయం, సిరికొండ నుంచి ఇంద్రవెల్లి వరకు నిర్మించిన లాంగ్ స్వాన్ బ్రిడ్జిలను ప్రారంభోత్సవం చేశారు. పిప్పిరి ఎత్తిపోతల పథకం, తేజపూర్ ఎత్తిపోతల పథకం, బుగ్గారం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగి చెక్డ్యాం, బోథ్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనం, పొచ్చరలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం, నాగోబా ఆలయ సుందరీకరణ అభివృద్ధి పనులకు రూ.20.40 కోట్లు, లక్కారంలో ఐటీడీఏ ఉట్నూర్ నూతన భవన నిర్మాణం, ఇచ్చోడ నుంచి డెడ్రా వరకు రూ.30 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.



