మొక్కజొన్న కొనుగోళ్లపై పరిమితిని ఎత్తివేయాలి
మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరగాలి
అకాల వర్షాల నష్టానికి పరిహారం చెల్లించాలి
దళారుల దోపిడీతో తీవ్ర నష్టాల్లో రైతులు
సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
కాకతీయ, బోనకల్ : ఎకరానికి 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమని, వెంటనే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు రక్తాన్ని శ్రమగా మార్చి పంటలు పండిస్తున్నారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో సీపీఐ ఎం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సిఐటియు కార్యాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం ఖమ్మం బస్టాండ్ సెంటర్ మీదుగా ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్ మద్దెల రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఎకరానికి సుమారు 40 క్వింటాల దిగుబడి వస్తున్నా కేవలం 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతులను నష్టాల్లోకి నెడుతోందన్నారు. మిగిలిన పంటను ఎవరు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
దళారుల దోపిడీ పెరుగుతోంది
మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారులు గ్రామాల్లోకి ప్రవేశించి తక్కువ ధరలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కోతుల బెడదతో పంటను కాపాడుకోవడంలో రైతులు తీవ్ర కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభావం దేశ ఆర్థిక విధానాలపై పడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిపై కూడా విమర్శలు చేశారు. తెలంగాణలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న మండలాల్లో బోనకల్ ఒకటని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించకపోతే రైతులు ఆందోళనలను మరింత తీవ్రం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ ఎం జిల్లా సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సీపీఐ ఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొమ్మినేని నాగేశ్వరరావు తుళ్లూరు రమేష్ నాయకులు జొన్నలగడ్డ సునీత గుడ్డుూరి ఉమ దొండపాటి సత్యనారాయణ జోనిబోయిన గురవయ్య బంధం శ్రీనివాసరావు గుగులోత్ నరేష్ సర్పంచ్ మంద కరుణ కేతినేని నాగేశ్వరరావు గుగులోతు పంతు చలమల హరికిషన్ రావు పుచ్చకాయల వల్లరాజు ముంగి వెంకన్న కారంగుల చంద్రయ్య ఎర్రదేశి నరసింహారావు గుడ్డురి వెంకట నరసయ్య ఉన్నం వెంకటేశ్వర్లు తాత వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


