‘డ్రగ్స్తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి’
మేడారం జాతరలో వినూత్నంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రచారం
కాకతీయ, మేడారం బృందం : నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తరుణంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో డ్రగ్స్, గంజాయి వినియోగానికి వ్యతిరేకంగా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మెడలో గవ్వల దండలు, తలపై ప్రత్యేక టోపీ ధరించి, చేతిలో మైక్తో “డ్రగ్స్తో జీవితం మసి… మానేస్తే జీవితం ఖుషి” అంటూ ఆయన ఇస్తున్న నినాదాలు యువతలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. పాటల ద్వారా సందేశాన్ని చేరవేస్తూ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను సూటిగా వివరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. మేడారం జాతరకు గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరవుతుండటంతో, ఇక్కడ అవగాహన కల్పిస్తే విస్తృత ప్రభావం ఉంటుందని భావించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి భక్తులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


