ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు
భూపరిపాలనలో మరో ముందడుగు
రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు
19న ముఖ్యమంత్రి చేతులమీదుగా లైసెన్సుల పంపిణీ
భూ రికార్డులు స్పష్టంగా ఉంచడమే లక్ష్యం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే గ్రామపాలనాధికారులు ( జీపీవో)ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. తాజాగా క్షేత్రస్ధాయిలో ప్రజలకు సులభంగా భూ సేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈనెల 19వ తేదీన శిల్ప కళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ ను జత పరచడం తప్పనిసరి చేసినట్లు తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూశాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్కుమార్, సర్వే విభాగం కమీషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు.
సర్వే విభాగం కీలకం కానుంది..!
భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం కానుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీచేయడం చేస్తున్నట్లు తెలిపారు. ఇంకోవైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునికి పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడానికి దరఖాస్తులను ఆహ్వానించగా పది వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తొలివిడతలో ఏడు వేల మందికి శిక్షణ ఇచ్చామని, ఇందులో 3465 మంది అర్హత సాధించారని తెలిపారు. భూ విస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. రెండవ విడతలో మరో మూడు వేల మందికి ఆగస్టు 18వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభించామని తెలిపారు. ఈనెల 26వ తేదీన జేఎన్టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్షణ ఉంటుందని వీరి సేవలు కూడా డిసెంబర్ రెండవ వారం నాటికి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
భూ రికార్డులు స్పష్టంగా ఉంచడమే లక్ష్యం
రెవెన్యూ శాఖకు సర్వే విభాగానికి అవినాభావ సంబంధం ఉంటుందని భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉన్నప్పుడే వివాదాలు తగ్గుతాయని అన్నారు. సర్వే వ్యవస్థ బలపడితేనే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్రస్దాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు తగిన సేవలు అందలేదని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో జీపీవోలు, ఇప్పుడు ప్రతి మండలంలో లైసెన్స్డ్ సర్వేయర్లు – ఈ రెండు చర్యలతో ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు అందేలా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, అవినీతి లేని సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.


