గడువులోగా గ్రంథాలయం పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం : జిల్లా గ్రంథాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం నగరంలోని బస్ డిపో రోడ్లో ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పనుల పురోగతిని పరిశీలించారు. లైబ్రరీ ఆవరణలో నిర్మిస్తున్న అదనపు రెండు అంతస్తుల భవనం, ప్రహరీ గోడ, టాయిలెట్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పరిశీలించారు. పాఠకులు, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సమకూరేలా పనులు చేపట్టాలని సూచించారు. ప్రహరీ గోడతో పాటు గేట్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాలు
గ్రంథాలయంలోని రీడింగ్ రూమ్లను సందర్శించిన కలెక్టర్, అక్కడ చదువుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారో, ఏ పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజుల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ప్రతి సంవత్సరం అప్డేట్ చేయాలని, పాత పుస్తకాలను తొలగించి కొత్తవాటిని అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ సిబ్బందికి సూచించారు. ప్రతి విభాగానికి అవసరమైన పుస్తకాల జాబితాను సిద్ధం చేసి వెంటనే అందించాలని ఆదేశించారు.


