- బహుజన రాజ్యం స్థాపన దిశగా టీఆర్పీ
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధనే ధ్యేయం
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్
కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణలో అగ్రవర్ణ పార్టీల కోటను బద్దలు కొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కట్టుబడి ఉందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీ కుమార్ యాదవ్ ప్రకటించారు. వరంగల్ లో శుక్రవారం జరిగిన టీఆర్పీ జిల్లాల కన్వీనర్, కో కన్వీనర్, నియోజకవర్గ కన్వీనర్ల నియామకం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నాళ్లు బీసీల పేరుతో ఓట్లు సేకరించి అగ్రవర్ణాల పక్షాన నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుకు తెస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాజకీయ రంగం మాత్రమే కాదు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల వరకు రిజర్వేషన్ అమలుకు టీఆర్పీ కట్టుబడి ఉంది అని అన్నారు. తమ వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి బహుజనుల రాజ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుతాం. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే వారికి తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదని అన్నారు. రాబోయే 100 రోజుల్లో బహుజనుల డంక తెలంగాణ అంతటా మోగబోతోందని ఆయన తెలిపారు. జిల్లా స్థాయి నాయకుల నియామకంపై సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించామన్నారు. ‘మేమెంతో – మాకు అంత’ అనే నినాదంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా ఎగురవేసి బహుజన ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తామని తీర్మానించారు. ఈ సమావేశం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగింది. ఉమ్మడి వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, నియోజకవర్గ కన్వీనర్లు పాల్గొన్నారు.


