గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
45 కేంద్రాల్లో 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం
పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు
మహబూబాబాద్ డీఈఓ రాజేశ్వర్
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జిల్లాలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సిఎస్లు, డివోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాది సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేలా కృషి చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, శుభ్రత, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు, టాయిలెట్లు, డ్యూయల్ బెంచీలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
భద్రతా చర్యలు కట్టుదిట్టం.. సెక్షన్ 144 అమలు
ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత, సీలింగ్ ప్రక్రియలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులకు టైమ్టేబుల్పై పూర్తి అవగాహన కల్పించాలని, ఎవరూ పరీక్షలకు గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఎస్ఓ అప్పారావు, డిసిఇబి కార్యదర్శి బాలాజీ, మండల విద్యాశాఖ అధికారులు, సిఎస్లు, డివోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


