కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు
విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు
రవీంద్రభారతిలో ఘన సన్మానం
కాకతీయ, ఖమ్మం : వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కోటపాటి రుక్మారావుకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ దళితరత్న అవార్డు బహూకరించింది. సామాజిక సేవకు కృషి చేస్తున్న కోటపాటి రుక్మారావులాంటి వ్యక్తులకు ఇలాంటి అవార్డులు అందజేయడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ సి. శ్రీధర్ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. విద్యాభివృద్ధి, సామాజిక సేవలో విశేష కృషి చేసిన కోటపాటి రుక్మారావును సత్కరించారు. ఈసందర్భంగా దొమ్మాటి సుదర్శన్ బాబు మాట్లాడుతూ కోటపాటి రుక్మారావు గత 15 సంవత్సరాలుగా దళితుల విద్యాభివృద్ధి, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సామాజిక అవగాహన కార్యక్రమాలు, యువతకు మార్గనిర్దేశం వంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించిందన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం కోటపాటి రుక్మారావు మాట్లాడుతూ ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను కలిగించిందన్నారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, సమాజ సేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగుతానన్నారు. సమ సమాజ స్థాపన కోసం కృషి చేస్తానన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో సేవ కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ పి. శ్రీనివాస రావు, సూపరింటెండెంట్లు అలీముద్దీన్, బాలసానిరెడ్డి, ఏ ఎస్ సి డి ఓ మోహన్, కళ్యాణ్, అల్లిబిల్లి మహేందర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య, కరెన్సీ పై బీఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ జెర్రిపోతుల పరుశురాం, పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ వర్గాల నుంచి కోటపాటి రుక్మారావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.


