కాకతీయ, తెలంగాణ బ్యూరో: మంత్రిపదవి విషయానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామంటూ మాట ఇచ్చారు. ఈ మాట ప్రకారం ఇవ్వండి. ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా? లోకసభ ఎన్నికల్లో రెండోసారి హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. 11 మంది గెలిచిన నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే తప్పేంటి? అన్నదమ్ముల్లో ఇద్దరూ సమర్థులమే. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే ఇంకా ఓపిక పడుతున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టే అన్నారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పాను.. ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు మాటిచ్చారు.. ఇచ్చినప్పుడు ఇవ్వండి.. కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. . ఇస్తామన్నమాట ఆలస్యమైంది.. సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు . ఎందుకు కుదరటం లేదు సమీకరణలు? ఎవరడ్డుకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను.. నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను.. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది. ప్రభుత్వ దవాఖానక పోతే పేదోడికి న్యాయం జరగాలి. ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి. పేదవాళ్ల కండగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.


