-
కేసీఆర్ దోపిడీ బట్టబయలు
-
ఘోష్ నివేదికతో కాళేశ్వరంలో అవినీతి బహిర్గతం
-
అవినీతి సొమ్ము పంచడానికి వస్తే తగిన బుద్ధి చెప్పండి
-
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
కాకతీయ, ఖమ్మం / హైదరాబాద్ : ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని మేము చెప్పాం..15 నెలల విచారణ తర్వాత జస్టిస్ పీసీ ఘోష్ 665 పేజీల తీర్పు ఇచ్చారు. కాళేశ్వరం అవకతవకలు అందులో రుజువయ్యాయి. అక్రమంగా దోచుకున్న డబ్బులు మళ్లీ ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు. ఆ డబ్బు తీసుకుని బీఆర్ఎస్కు రెండు చెంపలు చెళ్లుమనిపించాలి” అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం నాడు రెండు చోట్ల రూ.3.30 కోట్ల విలువైన పీఆర్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం రైతు వేదిక వద్ద నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని “ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం. ఇంకా మూడు విడతల్లో మరిన్ని ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఎవరి రాజకీయ అభిప్రాయం ఎలా ఉన్నా, ఎవరికి ఓటు వేస్తారో అడగకుండానే ఇళ్లు ఇస్తాం” అని స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ అభద్రతకు గురికావద్దని భరోసా ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజల దీవెనలు ఇందిరమ్మ ప్రభుత్వానికి లభించాలని కోరారు. రాష్ట్రంలో 15 కొత్త ఐటీఐ కాలేజీలలో ఒకటి తిరుమలాయపాలెంకు కేటాయించామని, 30 పడకల ఆసుపత్రిని 26 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తిరుమలాయపాలెం మండల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.77.50 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.ధరణి పేదలకు శాపంగా మారింది. దానిని బంగాళాఖాతంలో పడేసి, భూబారతి వ్యవస్థను తెచ్చాం. రెండు సార్లు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ను ప్రజలు మూడోసారి చెంపచెల్లుమనిపించారు” అని మంత్రి విమర్శించారు.


