కేసీఆర్ తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పంతో 2001లో గులాబీ జెండా ఎగురవేసిన సమయంలో పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, మరోవైపు శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వంటి బలమైన రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ, మీడియా శక్తి లేకుండా, ఆర్థిక బలం లేకుండా, కులబలం లేకుండా, కేవలం తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ ధైర్యంగా ముందుకు వచ్చారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చూపిన సాహసం దుస్సాహసంతో సమానమని, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే ధర్మబలం, సంకల్పమే ఆయనను ముందుకు నడిపించాయని కేటీఆర్ అన్నారు. పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో కేసీఆర్ చేసిన త్యాగాలు, ప్రజలతో కలిసి నడిచిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతరం పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించి, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపారని తెలిపారు. ఢిల్లీలో ప్రముఖ నాయకులు కూడా కేసీఆర్ను ఉత్తమ ఉద్యమకారుడిగా, ఉత్తమ పరిపాలకుడిగా ప్రశంసించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తెలంగాణ మట్టితో మమేకమైనవారికి మాత్రమే తెలంగాణ జాతి గౌరవం విలువ తెలిసుంటుందని కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో నిరాహార దీక్షలు చేసిన నాయకుడు, లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారులు మాత్రమే జాతి గౌరవం అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో పాల్గొనని వారు జాతి గురించి మాట్లాడటానికి అర్హులు కారని విమర్శించారు.
తెలంగాణ జాతి చరిత్ర గొప్పదని, రాణి రుద్రమదేవి, కుమరం భీం, సమ్మక్క-సారలమ్మ, సర్వాయి పాపన్న, సాకలి ఐలమ్మ, దాశరథి వంటి మహనీయుల వారసత్వాన్ని కలిగిన జాతి తెలంగాణదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు బానిసలు కారని, నిటారుగా నిలబడి పోరాడే భూమిపుత్రుల జాతి అని స్పష్టం చేశారు. తెలంగాణలో రెండు జాతులే ఉన్నాయని, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను ప్రజలే జాతిపితగా గౌరవిస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ తనను తాను ఎప్పుడూ జాతిపితగా ప్రకటించుకోలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు స్వీయ గౌరవాన్ని అందించిన నాయకుడిగా ప్రజలే ఆయనను ఆ స్థాయికి చేర్చారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వయంగా కేసీఆర్ కృషికి నిదర్శనమని, ఆయన ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ చేసిన సేవలు తెలుసని, తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన శాశ్వత ప్రతీకగా నిలిచిపోతారని కేటీఆర్ పేర్కొన్నారు.


