సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ
ఈనెల 25న మేడ్చల్లో సభ.. అన్ని వర్గాల ప్రజలకు ఆహ్వానం
కాకతీయ, ఖమ్మం టౌన్ : సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టినట్లు తెలంగాణ జాగృతి నాయకత్వంలో కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈనెల 25న హైదరాబాద్ మేడ్చల్లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్ను ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి 2008 నుంచి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో సంస్థ పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆశించిన లక్ష్యాలను పూర్తిగా సాధించలేదనే భావనతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం నుంచి ప్రజలు, మేధావులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం నాగేంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్, ధరావత్ గణేష్ నాయక్, భూక్య లక్ష్మణ్ నాయక్, గుగులోత్ నవిన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


