కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం
మంత్రి పొన్నం ప్రభాకర్
ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి చర్యలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని డంపింగ్ యార్డును రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. డంపింగ్ యార్డు కారణంగా పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.చొప్పదండి సభలో కరీంనగర్ డంపింగ్ యార్డును తరలిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డు తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ సమస్యలు సహా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు.

దాదాపు 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను ఒక్కరోజులో తరలించడం సాధ్యం కాదని, అయితే ఏడాదిలోపు పూర్తిస్థాయిలో తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.కరీంనగర్ నుండి తరలించే డంపింగ్ యార్డును వరంగల్–కరీంనగర్ మధ్య ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రెండు నగరాలకు ఇబ్బందులు లేకుండా వ్యర్థాల నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.రోజువారీగా వచ్చే చెత్తతో పాటు ఇప్పటికే పేరుకుపోయిన వ్యర్థాలను ఎలా తరలించాలన్నదానిపై ప్రత్యేక విధానం రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. చెత్త తరలింపుకు ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన
కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పలు హోటళ్లను సందర్శించి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.హోటళ్లలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించకుండా స్టీల్ పాత్రలు వినియోగించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.



