కాకతీయ రిపోర్టర్ను చంపేయాలి
కొత్తగూడెం నుంచి మనుషులను మాట్లాడు
స్కూల్ పర్మిషన్ గురించి తల్లిదండ్రులకు అవసరమా?
వార్తలు రాస్తే మాత్రం తల్లిదండ్రులకు చదువు వచ్చా?
గతంలో అనుమతి లేదు.. ఇప్పుడు వచ్చింది.. అయితే ఏంటి?
మణుగూరు కాకతీయ రిపోర్టర్కు రాధిక కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ బెదిరింపులు
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు… లీగల్గా చూసుకోమన్న సీఐ
ఇప్పటికైనా జిల్లా యంత్రంగా కదలాలని కోరుతున్న ప్రజలు, మీడియా ప్రతినిధులు
కాకతీయ, మణుగూరు: ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించినా భయం లేదు. తల్లిదండ్రులను మోసం చేసినా బెరుకు లేదు. విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినా కనికరం లేదు. అనుమతుల్లేకుండా మూడేండ్లుగా పాఠశాలను నిర్వహిస్తూ విద్యార్థులను మోసగించడమేగాక, ఇదే విషయాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చిన కాకతీయ పత్రిక విలేకరిపై బెదిరింపులకు దిగడం.. చంపేస్తామని హెచ్చరించడం రాధిక కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది. గతంలో పర్మిషన్ లేదు.. ఇప్పుడు తెచ్చుకున్నాం.. అయితే ఏంటి? అంటూ దురుసుగా సమాధానం ఇవ్వడం యాజమాన్యం అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది. అసలు అనుమతుల గురించి తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం తమకు ఏముంది.. వార్తలు రాస్తే పోయేదేముంది.. విద్యార్థుల తల్లిదండ్రులకు చదువు వచ్చా..? అంటూ వెకిలి ప్రశ్నలు వేయడం ప్రిన్సిపాల్ తల పొగరును సూచిస్తోంది.

ప్రిన్సిపాల్ నరేష్ బేరసారాలు
ఎంత కావాలో చెప్పు అన్న…? వార్తలు రాయకు అన్న.. ప్లీజ్ ! సాయంత్రం వచ్చి కలుస్తా.. ఇది రాధిక స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ బాగోతం. లోన లోటారం.. పైన పాటారం అన్న చందంగా ఉంది మణుగూరు రాధిక స్కూల్ వ్యవహారం. రాధిక స్కూల్ కి అన్ని పర్మిషన్లు ఉన్నాయని, మా మీద కావాలనే వార్తలు రాస్తున్నారని మీడియా ముందు మాట్లాడిన ప్రిన్సిపాల్ నరేష్ మరి కాకతీయ రిపోర్టర్తో కాళ్ల బేరానికి వచ్చి బేరసారాలకు దిగడం ఎందుకో..? గురువారం ఉదయం సుమారు 8:53 సమయానికి కాల్ చేసి రాజీవ్ గాంధీ నగర్ మార్కెట్ గోదాం నందు సెటిల్మెంట్ చేసుకుందాం అనడం దేనికి సంకేతం. అందితే జుట్టు … లేదంటే కాళ్లు .. అన్న విధంగా రాధిక స్కూల్ యాజమాన్యం వ్యహరిస్తున్న తీరు సంచలనంగా మారింది.
ఈక్రమంలోనే … స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎనిమిది మంది వ్యక్తులు మాట్లాడుకుంటూ… రిపోర్టర్ సతీష్ని చంపేయాలి. వాడి వల్ల ఇబ్బంది అవుతుంది.. రాధిక స్కూల్ మీద వార్తలు రాస్తున్నాడు. వాడిని ఏ విధంగా అయిన ఏసేయాలి. కొత్తగూడెం జిల్లా నుంచి మనుషులను మాట్లాడాలి.. అని చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది.


పోలీస్ స్టేషన్ రాధిక స్కూల్ ఫిర్యాదు
మూడు, నాలుగు సంవత్సరాలు రాధిక స్కూల్ కు ఎటువంటి అనుమతులు లేకుండా నడిపించారని, ఒక ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్లో రెండు విద్యా సంస్థలు నడుస్తున్నాయని, స్టడీ కండెక్ట్, టీసీల మీద శ్రీవిద్య స్టాంపులు వేసి రాధిక స్కూల్ యజమాని సంతకాలు చేస్తున్నారని కాకతీయ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిదే. దీనిపై స్కూల్ యాజమాన్యం బుధవారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారని తెలిసింది. డీఎస్పీ ఆ ఫైల్ను సీఐకు రిఫర్ చేయగా గురువారం ఇరువురిని పిలిపించి విషయాలు అడిగి తెలుసుకున్నారు. పూర్వి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత సంబంధిత విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి రాధిక స్కూల్కి పర్మిషన్ ఉందా..? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ అధికారి అనుమతి ఉందని చెప్పడంతో సీఐ ఇరువురిని కోర్టులో చూసుకోమని చెప్పడం గమనార్హం.


