కాకతీయ ఎఫెక్ట్..!
20ఎకరాల భూ కబ్జాకు చెక్
40కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తికి పరిరక్షణ
అక్షర సత్యమై భూ కబ్జా కథనం
తుంగారం సర్వే నెంబర్ 35లో 20ఎకరాలకు యత్నాలు
వరుస కథనాలతో అక్రమాల్ని ఎండగట్టిన కాకతీయ
రెవెన్యూ విచారణ.. ప్రభుత్వ భూమికి హద్దులు, బోర్డులు
కాకతీయను కొనియాడుతున్న భద్రాద్రి ప్రజలు

కాకతీయ, కొత్తగూడెం : కబ్జా ముఠాలు గద్దలుగా మారి ఎగరేసుకెళ్లాలని చూసిన ప్రభుత్వ భూమిని చివరకు కాకతీయ అక్షర యుద్ధం కాపాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పరిధిలోని సింగారం సర్వే నెంబర్ 35లో ఉన్న సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై సాగిన అక్రమాలకు చెక్ పెట్టి, కోట్ల విలువైన భూమిని రక్షణలోకి తీసుకువచ్చింది. అక్షరంతో పోరాడితే మార్పు సాధ్యమనే విషయాన్ని మరోసారి నిరూపించింది. తుంగారం గ్రామంలోని సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి కొంతకాలంగా కబ్జా ముఠాల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. అధికార పార్టీలోని కొంతమంది నేతలు భూకబ్జా యత్నాల వెనుక ఉన్నట్లుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. రాజకీయ మద్దతు, స్థానిక ప్రభావం అన్నీ కలిసొచ్చిన కబ్జా ముఠా ప్రభుత్వ భూమిని ఎవరూ అడగరన్న ధీమాతో ముందుకెళ్లింది. నిరుపేదలకు నిలువనీడ లేకపోయినా, వారికోసం ఉంచిన భూమినే కొందరు పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేసేందుకు పూనుకున్నారు.

కాకతీయ అక్షర పోరాటం..
మొదట ఈ భూమిని నిశ్శబ్దంగా ఆక్రమించుకున్న ముఠా.. తరువాత దానిని లేఅవుట్గా మార్చి ప్లాట్లుగా విభజించారు. ఒక్కో ప్లాట్కు లక్షల రూపాయలు వసూలు చేస్తూ క్రయవిక్రయాలు జరిపారు. ఇప్పటికే పది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి తమ ఆక్రమణకు ముద్ర వేశారు. కొనుగోలుదారులకు ఎలాంటి సమస్య ఉండదని, మేమున్నాం అంటూ భరోసా ఇచ్చి మరింత మంది ప్రజలను కూడా ఈ ఉచ్చులోకి దింపే ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతున్నా రెవెన్యూ శాఖ మౌనం పాటించడంతో అక్రమార్కుల ధైర్యం మరింత పెరిగింది. స్థానికంగా ఫిర్యాదులు వెళ్లినా అవి బుట్టదాకా చేరలేదన్న విమర్శలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో స్థానికులు కాకతీయను ఆశ్రయించి వివరాలు వెల్లడించడంతో క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల పరిశీలన, అధికారులు వివరణలతో వరుస కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. “కళ్ల ముందే కబ్జా” అనే కథనంతో అక్షర పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఒక్క కథనంతో ఆగకుండా వరుసగా కబ్జా వివరాలను వెలికితీసింది. సర్వే నెంబర్, స్థలం వివరాలు, జరుగుతున్న అక్రమాలు, రాజకీయ అండదండలు అన్నింటినీ స్పష్టంగా బయటపెట్టింది. అక్రమార్కుల తీరును ఎండగట్టింది. కాకతీయ కథనాలు ప్రచురితమయ్యాక జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరిగింది. చివరకు రెవెన్యూ అధికారులు స్పందించక తప్పలేదు. చండ్రుగొండ మండలం తహసిల్దార్ సంధ్య ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. స్థలాన్ని పరిశీలించిన అధికారులు అది అక్షరాల ప్రభుత్వ భూమేనని తేల్చారు. వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు భూమికి హద్దులు నిర్ణయించారు. సర్వే నెంబర్ 35కు సంబంధించిన భూభాగాన్ని గుర్తించి, స్పష్టంగా ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులకు గట్టి షాక్ తగిలింది. కబ్జా ముఠాల్లో కలవర మొదలైంది.
అసలు దందా ఎలా నడిచిందంటే..?!
తుంగారం గ్రామ సమీపంలోని ఈ భూమి మొదట ఖాళీగా ఉండటాన్ని గమనించిన అక్రమార్కులు దానిపై కన్నేశారు. రాజకీయ అండదండలు, అధికార పరిచయాలతో ముందుకు సాగారు. భూమిని ప్లాట్లుగా మార్చి, అధికారిక లేఅవుట్లా చూపిస్తూ విక్రయాలు ప్రారంభించారు. ప్రభుత్వ భూమి అయినప్పటికీ కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నమ్మబలికారు. కొంతమంది నిరుపేదలు, మరికొందరు మధ్యతరగతి ప్రజలు తమ జీవిత సొమ్మును పెట్టి ఈ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సమస్య వస్తే మేమే చూసుకుంటామని చెప్పి వారిని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇలా కబ్జా దందా బహిరంగంగా సాగినా అధికార యంత్రాంగం స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
ప్రభుత్వ భూమి రక్షణలోకి
ఈ భూమి కబ్జాపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ సంధ్య కూడా ఇది ప్రభుత్వ భూమేనని అంగీకరించినప్పటికీ రాజకీయ ఒత్తిడులు అడ్డొచ్చాయని వెల్లడించారు. కాకతీయ కథనాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. అక్షరం ఆయుధంగా మారి కబ్జా ముఠాలను వెనక్కి నెట్టింది. అధికార యంత్రాంగాన్ని కదిలించింది. అక్రమాలపై చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ సుమారు 40 కోట్లుగా అంచనా. ఇలాంటి విలువైన ప్రభుత్వ ఆస్తి కబ్జా ముఠాల చేతిలో పడకుండా కాపాడటం సాధారణ విషయం కాదు. ఇది పూర్తిగా అక్షర పోరాట ఫలితమేనని ప్రజలు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కాకతీయ పాత్రను ప్రశంసిస్తున్నారు. నిజం కోసం రాసినప్పుడు మార్పు ఎలా వస్తుందో ఈ ఘటన చూపించిందని అభిప్రాయపడుతున్నారు. అక్షరం ముందు అక్రమాలు నిలవలేవని, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే మీడియా ఎంత ముఖ్యమో ఈ సంఘటన స్పష్టం చేసింది.



